డైలీ సీరియల్లా సాగుతున్న కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ రాజకీయం.. మళ్లీ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. అసలే ముందు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే కుమారస్వామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని బీజేపీ చూస్తున్నట్టుంది. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ నేపథ్యంలో.. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గైర్హాజరీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్టే.. ఇప్పుడు కూడా సుమారు పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దూరం అవుతున్నారనే మాట వినిపిస్తోంది. వీరంతా ముంబైలోని ఒక రిసార్టులో సేదతీరుతున్నారని మీడియా కోడై కూస్తోంది. వీరంతా అసెంబ్లీకి హాజరుకాకపోతే బడ్జెట్ ఆమోదం పొందదు. బడ్జెట్ ఆమోదం పొందకపోతే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్టే.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. తనను కాంగ్రెస్ ప్రభుత్వం గుమాస్తాగా చూస్తుందంటూ సీఎం కుమారస్వామి కన్నీటి పర్యంతమవుతున్నారు. కన్నడ ప్రజలు ఎక్కువ సీట్లను ఇచ్చింది బీజేపీకే అయినా.. ప్రభుత్వంలోకి మాత్రం మళ్లీ కాంగ్రెస్ వచ్చింది. దీంతో అస్థిర ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ లోని అసంతృప్త ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. ప్రభుత్వాన్ని పూర్తిగా మైనారిటీలోకి నెట్టేసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే.. కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. దీనికి తగ్గట్టుగానే గవర్నర్ పాలన తరహాకు వెళ్లకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కవగానే కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో వేచి చూడాలి. ఇప్పటికీ ఈ సమస్య నుంచి గట్టేక్కిన బీజేపీ మళ్లీ మళ్లీ ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉందనేది వాస్తవం. ఓ రాష్ట్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడితే ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలు నెరపడానికే నేతలు సమయం కేటాయిస్తారనేదానికి కన్నడ ప్రభుత్వం పెద్ద ఉదాహారణ.