కేరళ రాష్ట్రంలో ఐదేండ్లకోసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు అధికారంలోకి వస్తుంటాయి. అయితే ప్రతి ఐదేండ్లకోసారి ప్రజలు మార్పును కోరుకుంటారని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు తెలిపాయి. కానీ ఈసారి సీన్ మారింది.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి తెరపడింది. లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘోర పరాజయం మూటగట్టుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం మోడల్గా నిలిచింది.
కేరళలో సీఎం పినరయి విజయన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అధికార ఎల్డీఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 44, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్ ప్రజల్లో ఎంతో పేరు గడించారు.
ఇటీవల ఏబీపీ-సీఓటర్ నిర్వహించిన సర్వేలో విజయన్ పట్ల ప్రజలు ఎంత మేర సంతృప్తికరంగా ఉన్నారనేది తేలింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పినరయి విజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్కు అయ్యప్పస్వామి దీవెనలు ఉన్నాయని చెప్పారు. అయ్యప్పతోపాటు ఈ నేలపై ఉన్న ఇతర మత విశ్వాసాలకు చెందిన దేవుళ్లు కూడా తమ ప్రభుత్వాన్ని దీవిస్తారని పినరయి అన్నారు.
పినరయి పై ఎన్ని వివాదాస్పద ఆరోపణలు ఉన్నా.. రెండోసారి కేరళ పీఠాన్ని చేజిక్కించుకున్న ఘనుడు. సీపీఎం పార్టీ శ్రేణుల్లో ఇలాంటి నేత లేడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేరళకు శక్తివంతమైన నేత ఆయనే అన్న సందేశాన్ని చాటాయి. పవర్ఫుల్ నేతగా ఆయన ఆవిర్భవించారు.