ఆంధ్ర.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి తెలియని వారుండరు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన కిరణ్కుమార్రెడ్డి.. తాను ఎంత చెప్పినా సోనియా, కాంగ్రెస్ పెద్దలు వినలేదంటూ.. బాహాటంగా ప్రకటించి.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత.. అట్టహాసంగా జైసమైక్యాంధ్ర పేరుతో పార్టీని పెట్టినా.. దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీంతో బీజేపీలో చేరి ఏపీ అధ్యక్షుడిగా నియామకమవుతారంటూ కొంతకాలం ప్రచారం జరిగింది. కానీ.. అదీ కుదరలేదు. దీంతో చేసేదేం లేక.. ప్రస్తుతం తన పాత గూటికే చేరుకోవాలని కిరణ్ జోరుగా పావులు కదుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. రీ ఎంట్రీ కోసం ఈ నెల 13వ తేదీ ముహూర్తం కూడా పెట్టేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన పాత మిత్రులు, కాంగ్రెస్ లో తనతో సన్నిహితంగా పని చేసి, ఆ తర్వాత ఏపీలో ఆ పార్టీ భూస్థాపితం అయిపోయాక, ఏ ఇతర పార్టీలో చేరకుండా ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నారన్నది ప్రచారం. ఇంతవరకూ ఈ వార్తలను కిరణ్ ఎక్కడా ఖండించకపోవడం కూడా ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు కేంద్రంతో తెగదెంపులు చేసుకుని, మోడీని టార్గెట్ చేసిన చంద్రబాబు ఇటు జగన్ ను, అటు మోడీని ఏపీలో దెబ్బ కొట్టాలంటే కిరణ్ లాంటి బలమైన లీడర్ కావాలని భావిస్తున్నాడు. 2019 ఎన్నికల బరిలో ఎక్కువ పార్టీలు ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అన్ని పార్టీలకు చీలిపోయి, అంతిమంగా అధికార పార్టీ లాభపడుతుందన్నది టీడీపీ అంచనా.
యూపీఏ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేకహోదా ఫైలు పైనే అని ఇప్పటికే సోనియా, రాహుల్ బహిరంగంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ రీ ఎంట్రీతో కాంగ్రెస్ కు అంతో ఇంతో ఏపీలో కలిసొచ్చే అవకాశముంది. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలవకపోయినా, జగన్ ఓటు బ్యాంకును చీల్చటం ఖాయం. రెడ్డికులం, రాయలసీమ ప్రాంతం వారీగా చూసినా కిరణ్ వల్ల జగన్ పార్టీకి దెబ్బ తప్పదు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా జగన్ కు బదులు కిరణ్ కు పడినా జగన్ కు చావు దెబ్బే. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి చేరికపై ఆయన సన్నిహితులు, కాంగ్రెస్ సీనియర్లు, టీడీపీ నేతలు, చంద్రబాబు లాంటి రహస్య మిత్రులు చాలా అంచనాలే పెట్టుకున్నారు. చంద్రబాబు, సోనియా, రాహుల్ కలిసి వేసిన పన్నాగం ఫలితమే.. మళ్లీ కిరణ్ కాంగ్రెస్ గూటిలో చేరడం. గతంలో అధిష్ఠానం ఆదేశాల ప్రకారం సీఎంగా కిరణ్ జగన్ కు చుక్కలు చూపించి, చంద్రబాబు సహకారంతో సీఎం సీటును కాపాడుకున్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో అదే రహస్య స్నేహం ప్రకారం కిరణ్ కాంగ్రెస్ లో చేరి, పాత కాంగ్రెస్ లీడర్లను, ఇటు జగన్ పార్టీలో ఉన్న సీనియర్లు, అసంతృప్తి నాయకులను లాగేసు కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
సొంతగూటికి వచ్చేందుకు కిరణ్ పెట్టుకున్న 13వ తేదీ ముహూర్తంపైనే అనేక సందేహాలు ఉన్నాయి. 13వ అంకెను అన్ లక్కీ నెంబర్ గా భావిస్తుంటారు. 13 అంకెను ఉచ్ఛరించాలన్నా భయపడుతుంటారు. కార్లకు, హోటల్ రూమ్స్ కి ఆ నంబర్ రాయకుండా జాగ్రత్త పడతారు. మరీ తప్పని పరిస్థితుల్లో 12 ప్లస్ 1 అని రాసుకుంటారు. పైగా 13వ తేదీ శుక్రవారం నాడు వస్తే ఇక అంతే సంగతులని పాశ్చాత్య దేశాల్లోనే కాదు మన దేశంలోనూ చాలా మంది భయపడుతుంటారు. ముఖ్య కార్యక్రమాలు. ముహూర్తాలు ఆ రోజు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. వాజ్ పేయ్ ప్రభుత్వం తొలిసారి 13 రోజులకు, రెండో సారి 13 నెలలకు కుప్పకూలటం రాజకీయ నాయకులెవరూమరిచిపోరు. ఇదొక్కటే కాదు ఇలా అనేక ఉదాహరణలు చెప్పి 13 అంకెను అశుభంగా, అమంగళంగా భావిస్తుంటారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి జూలై 13న ఆ రోజు శుక్రవారం. అంతేకాదు అమావాస్య కూడా కావడంతో, కాంగ్రెస్ లో రీ ఎంట్రీ ఆ రోజు వద్దని ఆయన సన్నిహితులు. శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా అనేకమంది కోరుతున్నారు. కిరణ్ ఈ సారి తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలంటే, 13వ తేదీ శుక్రవారం, అమావాస్య రోజు పెట్టుకున్న ముహూర్తాన్ని రద్దు చేసుకుని, అంతకుముందు కానీ తర్వాత కానీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మన తెలుగు వాళ్లు అమవాస్య రోజుని ఎంతగా పట్టించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఇది ఏడో నెల. చాలామంది ఏడు అంకెను కూడా అశుభంగా భావిస్తుంటారు. ఎంతలా అంటే ఏడు అంకెను పలకాల్సి వస్తే ఆరున్నొక్కటి అని పలుకుతారే తప్ప ఏడు అని అనటానికి ఇష్టపడరు. అలాంటిది ఏడో నెలలో 13వ తేదీ శుక్రవారం నాడు, పైగా అమావాస్య రోజున కిరణ్ పోలటిక్సులోకి రీ ఎంట్రీని అనేకమంది రాజకీయ నాయకులతో పాటు, ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎటూ జూలై 14 నుంచి ఆషాఢమాసం కనుక, ఆ నెల రోజులు ఆగి, వచ్చే శ్రావణ మాసంలో అయినా మంచి రోజు చూసుకుని కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవాలని సన్నిహితులు సలహాలిస్తున్నట్టు తెలిసింది.