వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం పైనే రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ధగా చేసిందని దానికి నిర్సనగా వైసీపీ ఎంపీలు తమ పదువులకు రాజీనామాలు చేశారు. ఇప్పటికే ఒకసారి వైసీపీ ఎంపీలతో స్పీకర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. మరోసారి ఆలోచించుకోవాలని జూన్ ఐదు, ఆరు తేదీల్లో మళ్లీ తనతో సమావేశం కావాలని సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండిలో మరోసారి ఈ ఎంపీలు స్పీకర్తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
ఒక వేల ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే మరో సారి ఉప ఎన్నికలు వస్తాయా..? రావా..? అన్న ఉత్కంఠ నెలకొంది. తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, వాటిని ఆమోదించమని కోరుతున్నామని వైఎస్సార్సీపీ ఎంపీలు అంటున్నారు. ఈ సారి స్పీకర్ కూడా ఆమోదించే అవకాశాలున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
తప్పని పరిస్థితుల్లో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా.. ఏపీలో బై పోల్స్ అయితే జరిగే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు జరగాలంటే.. గెలిచిన వ్యక్తి కనీసం పదవిలో ఏడాది కాలమైనా ఉండాలనే నిబంధన ఉందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే..మరో పది నెలల్లోనే లోక్సభ సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చు.
వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొంది, ఉప ఎన్నికలు జరిగినా.. గెలిచే వారి పదవీ కాలానికి ఏడాది వ్యవధి కూడా ఉండదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా సాధారణ ఎన్నికల వరకూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ సీట్లను ఖాళీగానే ఉంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతనిజముందో కొద్ది రోజుల్లో తేలనుంది.