దేశంలో ఏరంగంలో నైనా రాజకీయ నాయకుల హస్తం ఉండాల్సిందె. ఇక క్రీడా రంగం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికె అనేక క్రీడారంగాల్లో రాజకీయ పలుకుబడితో క్రీడా రంగాన్ని శాసిస్తున్న బడాబాబుల వారసులు బ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపనలు అనేకం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో స్పోర్ట్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆకుంభకోణంలో అధికారపార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల వారుసలమీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొన్న పరిటాల శ్రీరామ్ ఈ వివాదంలో ఇరుక్కోగా.. తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి కూడా ఇదే వివాదంలో ఇరుక్కున్నారు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలు కావడంతో.. క్రీడా అసోసియేషన్లలో చోటు సంపాదించిన వీరు.. నకిలీ సర్టిఫికెట్లను ఇష్యూ చేయడం, ఒలింపిక్ అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
కనీసం మ్యాచ్ కోర్టులోకి కూడా అడుగుపెట్టని వ్యక్తులకు క్రీడా సర్టిఫికెట్లు ఇష్యూ చేసి క్రీడా రంగం పరువు తీస్తున్నారన్న ఆరోపణలు పరిటాల శ్రీరాంపై ఉన్నాయి. బడా కుటుంబాలకు చెందినవారెవరైనా సర్టిఫికెట్ల కోసం సంప్రదిస్తే.. డబ్బులు దండుకుని వారికి సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్లుగా పరిటాల శ్రీరామ్ పై ఆరోపణలు వస్తున్నాయి.
అనంతపురం ఎంపీ జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు వస్తున్నాయి. ఒలింపిక్ అసోసియేషన్ కు చెందిన నిధులను దుర్వినియోగం చేశారని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో వెల్లడించారు. 2016నుంచే పవన్ ఈ వివాదంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేశ్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు ఒలింపిక్ అసోసియేషన్లు ఉండగా, సీఎం రమేశ్ వర్గంలో అనంతపురం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా పవన్ కుమార్ ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరామ్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.
ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల నేపథ్యంలో పురుషోత్తం వర్గం దానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నింటిని ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేష్ సహా జీసీ రావు అనే మరో వ్యక్తిపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వీరిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. కోర్టులోను క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు చేశారు.
సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగంతో అసలైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. దానికి తోడు ఇద్దరు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తులే ఈ అవినీతికి పాల్పడటంతో జిల్లా పరువు మంట కలిసిపోయిందని పలువురు వాపోతున్నారు.