జమ్మలమడుగు నియోజవకర్గంలో మరోసారి రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మంత్రి ఆది వర్గీయులు మరోసారి వైసీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో ఆదివారం మంత్రి వర్గీయులు బీభత్సం సృష్టించింది. దీంట్లో ఏకంగా మంత్రి భార్య, కొడుకుకూడా పాల్గొనడంతో ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామంలో ఇటీవల వివాహమైన ఓ నూతన దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆ పార్టీ నేతలు తరలిరావడాన్ని జీర్నించుకోలేని మంత్రి తనయుడు సుధీర్రెడ్డి కార్యకర్తలతో గ్రామంలో వీరంగం వేశారు. మాకు చెప్పకుండా వైసీపీ నేతలను ఎలా ఆహ్వానిస్తారని రెచ్చిపోయి దాడులు చేయడంతోపాటు ఆస్తులను ధ్వంసం చేశారు. వైసీపీకీ చెంది నికుళాయిరెడ్డి, అంజయ్య, అయ్యవారు కుటుంబాలకు చెందినవారు కనిపించగా వారిపై దాడులకు తెగబడ్డారు. ట్రాక్టర్, స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు.
పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ వివాహం మే 25న జరిగింది. వివాహానికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర నాయకులను ఆహ్వానించారు. అప్పట్లో ఢిల్లీ పర్యటనలో ఉండిపోయినందున పెళ్లికి ఎంపీ హాజరవలేదు. దీంతో ఆదివారం నూతన దంపతులను ఆశీర్వదించేందుకు ఎంపీ అవినాష్రెడ్డి.. మేయర్ సురేష్బాబు, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డితో కలసి పెద్దదండ్లూరుకు పయనమయ్యారు.
పోలీసులుకూడా అధికారపార్టీకే కొమ్ముకాస్తూ ఎంపీ అవినాష్రెడ్డి, మేయర్ సురేష్బాబు, సమన్వయకర్త సుధీర్రెడ్డి, హర్షవర్థన్రెడ్డి తదితరులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అవినాష్రెడ్డి, సురేష్బాబు, సుధీర్రెడ్డిని కడప శివారులోని చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్కు తరలించారు.