రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ఏకంగా విజయమ్మ రంగంలోకి దిగారు. పార్టీని వీడిన నాయకులను పార్టీలోకి రప్పించేందుకు పావులు కదుపుతున్నారు.
ఉత్తరాంధ్రజిల్లాలో బలమైన నాయకుడు కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ను ఎదురించి జగన్ కొత్త పార్టీ పెట్టినప్పటినుంచి జగన్ వెంటే నడిచారు. కాంగ్రెస్ నేత బొత్ససత్యనారాయణ వైసీపీలోకి రావడంతో కొనతాల రామకృష్ణ పార్టీనుంచి వెల్లిపోయారు. అయితే ఇప్పటి వరకు ఏపార్టీలో చేరుతారనేది ప్రకటించలేదు.
ఈక్రమంలో ఇటివల వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ద్వారా గతంలో వైసీపీ నుండి బయటకు వెళ్ళిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తిరిగి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విజయమ్మ . కొణతాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్న వైసీపీ, ఆయన కోసం కన్నబాబురాజును రంగంలోకి దింపింది. ఇప్పటికే మూడుసార్లు కొణతాలను కలిసి కన్నబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలోకి వస్తే అనకాపల్లి లోక్సభ టికెట్తోపాటు, పోటీ కోసం ఆర్థికంగానూ సాయం అందిస్తామని అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి కూడా కొణతాలతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. అయితే, కొణతాల మాత్రం తొందరపడకుండా త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానని వారికి చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. తిరిగి పార్టీలోకి వస్తే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు.