ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రాజకీయాలను పక్కనపెట్టి పోరాటం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా పోరాటం కీలక దశలో ఉందని, హోదా కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని, ఇది శుభపరిణామం అని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు.
అమరావతిలో కూర్చుని అఖిలపక్షం పెడితే లాభం లేదని, అందరం కలిసి రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడదామని, రాజకీయాలను పక్కనపెట్టి పోరాడదామని, వ్యక్తిత ప్రయోజనాలు ముఖ్యం కాదని, కలిసికట్టుగా పోరాడితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.
ఏమైనా రాజకీయాలు ఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసుకుందామని, ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాడదామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులు వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే లాలూచీ పడినట్లేనని విమర్శించారు. ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఆ తేదీ కన్నా ముందే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా తమకు అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి అన్నారు.