నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం వైసిపిలో నిరూత్సాహం నెలకొన్న సంగతి తెలసిందే. పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ…టీడీపీని దెబ్బ తీసేలా వైసీపీ కొత్త వ్యూహాన్ని అమలు చేయనుంది. బాబుకు దిమ్మతిరిగి పోయెలా పార్టీని మరింత వ్యూహాత్మకంగా టార్గెట్ చేయాలని జగన్, ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓ సామాజిక వర్గానికి పట్టం కడుతుందని జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు.
ముల్లును ముల్లుతోనె తీయాలనె వ్యూహాన్ని అమలు చేయనున్నారు. టిడిపిని దెబ్బతీసేందుకు టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే సామాజికవర్గానికి పట్టం కడుతున్నారన్న ప్రచారాన్ని నిదర్శనాలతో సహా నిరూపించేందుకు వైసిపి సిద్ధమవుతోంది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని పదవులు కట్టబెట్టారన్న జాబితాను నాడు టిడిపి విడుదల చేసింది. ఇప్పుడు వైసిపి అదే వ్యూహం అనుసరించనుంది.
టిడిపి ప్రభుత్వం గత మూడున్నరేళ్ల నుంచి పై నుంచి కింది స్థాయి వరకూ జరిపిన వివిధ నియామకాలు, అంతకుముందు అందులో కొనసాగిన ఇతర సామాజిక వర్గాలను తొలగించి, వారి స్థానంలో సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించిన తీరును వివరాలతో సహా వెల్లడించనుంది.
అడ్వకేట్ జనరల్గా ఉన్న వేణుగోపాల్ను రాజీనామా చేయించడం, ఆయన స్థానంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం మొదలు… ఇప్పుడు పిపిలు, స్టాండింగ్ కౌన్సిళ్ల సభ్యులుగా మెజారిటీ శాతం మళ్లీ అదే కులం వారిని కొనసాగిస్తున్నారని వైసిపి భావిస్తోంది.
ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో కీలకమైన పదవులు, అధికారుల నియామకాలు, అమరావతిలోని ఆ సామాజిక వర్గానికి చెందిన సంస్థలకు కేటాయించిన భూముల వివరాలు, పోలీసు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఐటి, ఆర్ అండ్ బి, న్యాయ, పంచాయతీరాజ్ శాఖల్లో ఆ వర్గానికి ఇచ్చిన పోస్టింగులు, కట్టబెట్టిన కాంట్రాక్టుల వివరాలను సేకరించే పనిలో ఉందని అంటున్నారు.
విజయవాడ, గుంటూరు.. నెల్లూరు దాకా కోస్తాలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ హవాకు మిగిలిన కులాలు నష్టపోతున్నాయన్న భావన అందరిలో ఉందని, విజయవాడ, గుంటూరులోనే కాదు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ అదే పరిస్థితి ఉందని, ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన వారికే కట్టబెడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితె దీన్ని ఎలా అమలు చేయాలనె దానిపై వైసీపీ తర్జనా,భర్జనా పడుతోంది. మీడియా ముఖంగా వెల్లడించాలా? లేక సోషల్ మీడియా ద్వారా ఇతర సామాజికవర్గాల వారి వద్దకు తీసుకు వెళ్లాలా అనే విషయమై ఇంకా వైసిపి నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. ఇందుకోసం వైసిపి నేతలు సెక్రటేరియేట్, కమిషనరేట్ స్థాయి అధికారులు, కొందరు మీడియా ప్రముఖులను ఇప్పటికే సంప్రదిస్తున్నారని అంటున్నారు. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేయనున్నారు.