ఇండియన్ టెలికం రంగంలో అదిరిపోయే ఉచిత ఆఫర్లతో దుమ్ములేపింది రిలయన్స్ జియో. అయితే ఇప్పుడు రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా ఆఫర్ ఇచ్చింది టెలికం దిగ్గజం అయిన ఎయిర్టెల్. తమ 4జీ నెట్ వర్క్ లోకి మారే కస్టమర్లకు కొత్త ఏడాదంతా ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సరికొత్త ఆల్ ఫ్రీ ఆఫర్ 2017 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. 4జీ మొబైల్ హ్యాండ్ సెట్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
అయితే ఎంపిక చేసిన ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్యాకేజీలపై మాత్రమే ఇది వర్తిస్తుందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఈ ఆల్ ఫ్రీ ఆఫర్ కావాలనుకునే వారు బుధవారం నుంచి ఫిబ్రవరి 28లోపల ఎయిర్ టెల్ లోకి మారాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లను మార్చి 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్టెల్ జియోకు పోటీగా ఈ ఆఫర్ తెచ్చింది.
4జీ మొబైల్ కలిగినవారు ఎయిర్టెల్ 4జీ నెట్ వర్క్కు మారాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ 3జీ వినియోగదారులు 4జీకి అప్గ్రేడ్ కావాలి. ఇక ప్రీ పెయిడ్ వినియోగదారులు రూ.345 ప్యాకేజీతో దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు 4జీ డేటాను 1జీబీ వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 4జీకి వచ్చిన వారు ఇన్ఫినిటీ ప్యాకేజీలతో అపరిమిత కాల్స్తో పాటు నెలకు 3జీబీ డేటాను ఏడాది వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపింది.
Related