వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గత 278 రోజులుగా రాష్ర్టంలోని అన్ని జిల్లాలు, ప్రాంతాల్లో సుదీర్ఘ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్ చేపట్టిన ఈ పాదయాత్రలో మొదటి నుంచి ఇప్పటివరకూ ఒకే ఒక్క అంశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దానిపైనే అటు జనం.. ఇటు అధికార పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అసలేం జరుగుతోంది. తాము చూస్తున్నది నిజమేనా. నిజంగా జగన్కు అంత సీనుందా. జగన్ అంటున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబోతున్నాడా.. అనే చర్చ అందరిలోనూ జరుగుతోంది. జగన్ చెప్పే స్పీచ్లు, చంద్రబాబుపై చేస్తున్న మాటల తూటాల దాడి.. ఎవరికీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. కనిపిస్తున్నదంతా.. ఆ ఒక్క అంశమే. అది ఇప్పుడు జగన్కు పోటీగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్న వారి గుండెలు జారేలా చేస్తోంది. ప్రజా సంకల్పయాత్ర ఆరంభం నుంచి.. గత పది నెలలుగా జగన్ పాదయాత్రలో ప్రాంతాలు మారుతున్నాయ్, ప్రసంగాలు మారుతున్నాయ్, నాయకులు మారుతున్నారు.. కానీ.. ఒక్క అంశంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అదే.. ఇప్పుడు జగన్కు కొండంత బలంగా మారింది. ఆ ఒక్క అంశం మరేంటో కాదు.. జనం. మామూలుగా జనం అని తేలికగా అనడానికి వీళ్లేదు… ప్రభంజనం అనే పదం కూడా చిన్నదే అవుతుంది.
విజయనగరం జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళంతో ముగిసిపోనుంది. గత 278 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రసంగాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఓ రెండు రోజులు కూర్చొని వింటే.. ఆరంభం నుంచి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు, అతని మంత్రుల అవినీతి, తమ ప్రభుత్వం వస్తే అమలు చేసే పథకాల గురించి, ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, పరిస్థితులపై మాట్లాడ్డం.. తప్ప ప్రసంగాలే ఉంటున్నాయి. ప్రతి జిల్లాలో జరిగే పర్యటనను నిత్యం లైవ్ టెలికాస్ట్ల ద్వారా ప్రపంచమంతా చూస్తోంది. అందుకే.. దానిలో కొత్తదనం ఏం కనిపించడం లేదు. జగన్ చేసే ఆరోపణలకు అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి.. ఎదురుదాడి చేస్తున్నారు. దీనిలో ఎలాంటి ఆసక్తి, కొత్తదనం జనానికి కనిపించడం లేదు. కానీ.. ఆరంభం నుంచి ఇప్పటివరకూ.. ప్రతి జిల్లాలోనూ జగన్ సభలకు వస్తున్న జనం మాత్రం ఒకేలా ఉంటున్నారు. ఉప్పెనలా పోటెత్తుతున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం అని మాటల్లో చెప్పడమే తప్ప.. అలా వస్తే ఎలా ఉంటుందో ఈ కాలం వాళ్లకు పెద్దగా తెలియదు. కానీ.. జగన్ సభలను చూస్తే.. ఇలా ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఎవరు ఔనన్నా.. కాదన్నా.. అందరిలో ఓ ఆసక్తి, చర్చకు కారణమవుతున్న అంశం ఇదొక్కటే. బిందువు.. బిందువు కలిసి సింధువైనట్టుగా జగన్ ఎక్కడికెళ్లినా.. జనం ఇరగబడి ఉంటున్నారు. అదికూడా మధ్యలో ఎక్కడా ఒక్కచోటకూడా ఖాళీ స్థలం అనేది లేకుండా.. ఓ క్రమ పద్ధతిలో జగన్ ప్రసంగాల సమయంలో జనం.. నిలబడి ఉంటున్న క్రమం మాత్రం గతంలో ఎన్నడూ.. ఎక్కడా.. ఏ నాయకుడి సభల్లోనూ చూడనిదే. అదికూడా ప్రతి పట్టణం, నగరంలోని కొన్ని చౌరస్తాలను ఎంపిక చేసి.. అక్కడే జగన్ తన వాహనంపై నిలబడి మాట్లాడుతూ వెళుతున్నారు.
ఓ సభ మాదిరిగా ఎక్కడో ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నదీ లేదు. కానీ.. ఆ చౌరస్తాలోనికే చీమల దండులా వచ్చి జనం చేరుతున్నారు. జగన్ వస్తారనడానికి సరిగ్గా ఓ గంట ముందు.. జనసందోహం ఆ ప్రాంతానికి చేరుకుంటోంది. జగన్తో పాటూ పాదయాత్రగా ఓ రెండు మూడు వేల మంది వస్తున్నారు. వాళ్లు కూడా ఎక్కడ ఏ చిన్న ఖాళీ ఉన్నా.. అక్కడికి వెళ్లిపోయి ఉంటున్నారు. అందుకే.. జగన్ సభలకు సంబంధించి విడుదల చేస్తున్న పొటోలు, వీడియోల్లో జనం.. ప్రభంజనంలా కనిపిస్తున్నారు. అయితే.. జగన్ సభలకు పక్కాగా మాస్టర్ ప్లాన్ ప్రకారం.. జనాన్ని తరలిస్తున్నారని, ఇదంతా ప్రశాంత్ కిశోర్ మైండ్లోంచి వస్తున్న ప్లానింగ్ అంటూ అధికార, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అదికూడా ప్రతి పట్టణంలోనూ ఇరుకైన ఓ గల్లీలా ఉండే రోడ్లను ఆనుకుని ఉండే చౌరస్తాలనే ఎంపిక చేసి.. జనాన్ని పక్కా ప్లానింగ్తో దానిలోనికి పంపుతున్నారంటూ.. వాళ్లు పేర్కొంటున్నారు. ఎంత పక్కాగా చేస్తే మాత్రం.. మరీ ఇంత ఆర్గనైజ్డ్గా చేయడం సాధ్యమా అనేది ప్రశ్నార్థకం. అదే.. అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. చూసిన సామాన్యలు మాత్రం అంటున్న మాట ఒక్కట… అబ్బా ఏం జనం వస్తున్నారబ్బా. వచ్చిన వాళ్లంతా ఓట్లేసినా.. చాలు జగన్ సీఎం అయిపోవడం ఖాయమంటూ టాక్ నడుస్తోందిప్పుడు. ఎలాగూ.. రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు సహా పాదయాత్ర చేసిన వారంతా ముఖ్యమంత్రి పీఠంపై తిష్ఠవేసిన చరిత్ర ఏపీకి ఉంది.. మరి జగన్ విషయంలోనూ ఇదే జరుగుతుందా.. లేక గతానికి విరుద్ధంగా జరుగుతుందా.. అనేది మరో ఐదారు నెలల్లో తేలుతుంది.