భారత మాజీ కెప్టెన్, టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరును ద్రోణాచార్య అవార్డుకు నామినేట్ చేయటం వివాదాస్పదంగా మారింది. రాహుల్ పేరును ప్రతిపాదించడంపై బీసీసీఐలోనే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్రావిడ్ ను నామినేట్ చేయడమంటే… క్రికెటర్లను చిన్న వయసులోనే గుర్తించి, వారిని సాన పట్టిన గురువులకు అన్యాయం చేయడమేనని కొందరు వాదిస్తున్నారు. దీంతో ఏకంగా బీసీసీఐలోనే ఈ వ్యవహారం చీలిక తీసుకొచ్చింది.
భారత క్రికెట్ కోసం రాహుల్ ద్రావిడ్ చేసిన సేవలు వెలకట్టలేనివని చెప్పడంలో వాస్తవం ఉందని… అయితే, కోచ్ గా అతని అనుభవం కేవలం మూడేళ్లు మాత్రమే అని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డును అందుకునే అర్హత ద్రావిడ్ కు ఇంకా రాలేదని బీసీసీఐకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
సుప్రీం కోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ మాత్రం ద్రవిడ్.. ద్రోణాచార్య అవార్డుకు అన్ని విధాల అర్హుడంటూ వాదిస్తోంది. కమిటీ చీఫ్ వినోద్ రాయ్ గురువారం ద్రవిడ్ పేరును నామినేట్ చేసినట్లు ప్రకటన చేసింది తెలిసింది. ఆ సమయంలో ద్రవిడ్పై ఆయన ప్రశంసలు గుప్పించాడు. ఇక ఈ వ్యవహారం ముదరకుండా ఇరు వర్గాలు భేటీ కావాలని నిర్ణయించాయి. క్రీడా మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఆటలో 20 ఏళ్లు కోచ్గా అనుభవం ఉన్న వ్యక్తులనుగానీ లేదా తక్కువ సమయంలో గొప్ప ఆటగాళ్లను తయారు చేసే కోచ్ల పేర్లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించొచ్చు.