ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో సెమీస్ ముంగిట ఆస్ట్రేలియా జట్టుని గాయాల బెడద వెంటాడుతోంది. పాయంట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టునుంచి గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం అవుతుండంతో ఆందోళనలో ఉంది టీమ్ మేనేజ్ మెంట్.
ఇప్పటికే లీగ్ దశలో 8 మ్యాచ్లాడిన ఆస్ట్రేలియా ఏడింట్లో గెలుపొంది సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ని శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందే ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం అయ్యారు.మ్యాచ్ కోసం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు షాన్ మార్ష్, మాక్స్వెల్ తాజాగా గాయపడ్డారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరూ గాయపడగా.. ఇందులో షాన్ మార్ష్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను వరల్డ్కప్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కోంబ్ ను తీసుకున్నామని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగ్ వెల్లడించాడు. ఈ టోర్నీలో మార్ష్ కేవలం రెండు మ్యాచ్ లుమాత్రమే ఆడాడు.
ఇక మరో కీలక ఆటగాడు మాక్స్ వెల్ కు కూడా ప్రాక్టీస్ మ్యాచ్లో గాయం అయ్యింది. నెట్స్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన బంతిని హుక్ చేయబోయిన మాక్స్వెల్.. బంతిని ఆశించిన విధంగా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో.. వేగంగా వచ్చిన బంతి మోచేతిని బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడిపోయిన మాక్స్వెల్ ప్రాక్టీస్ సెషన్ నుంచి తప్పుకున్నాడు.ఈ గాయంతో పెద్దగా ప్రమాదం లేదని లాంగర్ తెలియజేసినప్పటికీ, ఆ జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మాక్స్వెల్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.