రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. మౌంట్ మాంగనూయి వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆతిధ్య జట్టుపై అద్భుత విజయం సాధించింది. 325 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కీవిస్ బౌలర్ల ధాటికి 234 పరుగులకే చేతులెత్తేసింది. తొలి సగంలో బ్యాట్స్మెన్, తర్వాత బౌలర్లు రాణించడంతో కోహ్లీసేనకు సునాయాస విజయం దక్కింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9×4, 3×6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలు బాదగా.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్: 33 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించారు. మధ్య ఓవర్లలో అంబటి రాయుడు (47: 49 బంతుల్లో 3×4, 1×6), కెప్టెన్ విరాట్ కోహ్లి (43: 45 బంతుల్లో 5×4), ఆఖర్లో కేదార్ జాదవ్ (22: 10 బంతుల్లో 3×4, 1×6) సమయోచిత హిట్టింగ్తో ఆకట్టుకున్నారు.
325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు శుభారంభం చేయలేకపోయింది. 51 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. మార్టిన్ గప్టిల్(15), విలియమ్సన్(20), మున్రో(31), రాస్ టేలర్(22), టామ్ లాధమ్(34), గ్రాండ్ హోమ్(3), హెన్రీ నికోలస్(28), ఇష్ సోధీ(0)లు వరుసగా క్యూకట్టడంతో కివీస్కు ఘోర ఓటమి తప్పలేదు. బ్రాస్వెల్(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ కివీస్ను గెలిపించలేకపోయాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, చాహల్, భువి చెరో రెండు వికెట్లు, షమీ, జాదవ్ చెరో వికెట్ తీయడంతో కివీస్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.