భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకి వరుణుడు అంతరాయం కలిగించాడు. టెస్టులో మూడో రోజైన ఆదివారం ఉదయం నుంచి స్టేడియం పరిసరాల్లో వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకి ఆరంభంకావాల్సి మ్యాచ్ ఆలస్యమవుతోంది.
పిచ్, అవుట్ ఫీల్డ్ను గ్రౌండ్మెన్ కప్పి ఉంచగా, వర్షపు నీటిని అధునాతన సదుపాయాలతో తొలగిస్తున్నారు. కేప్టౌన్లోని మ్యాచ్ జరిగే న్యూలాండ్స్ స్టేడియానికి సంబంధించి డ్రైనేజ్ వసతులు మెరుగ్గా ఉండటంతో మ్యాచ్ను సజావుగా నిర్వహించడానికి పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు. ఐదు రోజుల్లో ఏదొక సందర్బంలో వర్షం పడే అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన నేపథ్యంలో న్యూలాండ్స్ యాజమాన్యం కూడా అప్రమత్తంగానే ఉంది.
శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్), నైట్వాచ్మన్ రబడ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా సఫారీ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే ఈ మ్యాచ్లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది.