మాజీ కెప్టెన్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపితే బావుంటుందని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అవసరమైన సమయంలో ఆపద్భాందవుడిలా జట్టును ఆదుకోవడంలో ముందుండే మహేంద్ర సింగ్ ధోని ట్వంటీ-20 ఫార్మాట్లో గత కొంతకాలంగా క్రీజులో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల్లో ధోని బరిలోకి దిగనున్నాడు.
వికెట్ల వెనుకాల నిలబడి వ్యూహాలు రచిస్తూ.. వికెట్లు పడేలా చూడటంలో ధోనీ తర్వాతే మరెవరైనా. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే మహీ అంతగా ఆకట్టుకోలేక పోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య తర్వాత ధోనీ బ్యాటింగ్కు వస్తున్నాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తుండటంతో కుదురుకోవడానికి సమయం సరిపోవడం లేదు. ఈ కారణంగా పెద్దగా పరుగులు రాబట్టలేక పోతున్నాడు. దీంతో మహేంద్రుణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు తీసుకు రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కానీ కోహ్లి మాత్రం ధోనీని ఫినిషర్గా పంపుతున్నాడు. ఈ విషయమై సెహ్వాగ్ స్పందిస్తూ.. ధోనీకి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే ఫర్వాలేదు. ఒకవేళ త్వరగా అవుటైతే మాత్రం భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోతామని కోహ్లి భయపడుతుండొచ్చని వీరూ అభిప్రాయ పడ్డాడు.
కానీ ధోనీకి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ కల్పించాలి. మనీష్ పాండే, హార్దిక్, జాదవ్ల్లో ఒకరికి ఫినిషర్గా బాధ్యతలు అప్పగించాలని వీరూ సూచించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్కు ట్వంటీ-20ల్లో మంచి రికార్డే ఉంది. ధోని సారథ్యంలోని టీమిండియా 2007లో టీ-20 ప్రపంచకప్ను గెలుపొందింది.