వాండరర్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఆటగాళ్లు విలవిలలాడిపోయారు. తొలి రెండు టెస్ట్ల ఓటమి తర్వాత వైట్వాష్ నుంచి తప్పించుకొనేందుకు తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో ఊహించనంత ప్రదర్శన కనబర్చలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారా, మినహా మిగితా ఆటగాళ్లందరూ స్వల్ప స్కోర్ చేసి పెవిలియన్ చేరారు. ఆఖర్లో భువనేశ్వర్ వచ్చి మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్లో టీం ఇండియా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13 పరుగులు వద్దే ఓపెనర్లు కేఎల్ రాహుల్(0), మురళీ విజయ్(8) ఔట్ అయ్యారు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారాతో కలిసి జట్టును ఆదుకున్నారు. ఓ వైపు పుజారా వికెట్ను కాపాడుతుంటే.. మరోవైపు కోహ్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేందుకు కృషి చేశారు.
ఈ నేపథ్యంలో తన టెస్ట్ కెరీర్లో 16వ హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఆ వెంటనే డివిలియర్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఔట్ తర్వాత పుజారా వేగం పెంచాడు. అప్పటివరకూ మందకోడిగా ఆడిన పుజారా బౌండరీలు బాదుతూ.. 178 బంతుల్లో 50 పరుగులు చేసి వెంటనే ఔట్ అయ్యాడు.
తొలి రెండు టెస్టు మ్యాచుల్లో అజింక్యా రహానేకు అవకాశం ఇవ్వకపోవడంపై కెప్టెన్ కోహ్లి సీనియర్ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో అవకాశం కల్పించగా రహానే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మోర్కెల్ వేసిన 51.4 ఓవర్లో రహానే(9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పార్దీవ్ పటేల్ పుజారా ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు.
బ్యాట్స్మెన్లు పార్థీవ్ పటేల్(2), పాండ్యా(0), షమీ(8), ఇషాంత్(0) చెత్తషాట్లకు ప్రయత్నించి ఔట్ అయ్యారు. ఆఖర్లో భువనేశ్వర్ వచ్చి దూకుడుగా ఆడాడు. 49 బంతుల్లో 30 పరుగులు చేసి భువీ రబాడా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 76.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలింగ్లో రబాడా 3, పెహ్లుక్వాయో, మోర్కెల్, ఫిలాందర్ చెరి రెండు, ఎంగిడి 1 వికెట్ తీశారు.