దాదాపు నెలన్నరపాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ ఆఖరి పోరుకు సమయం ఆసన్నమైంది. ఓవైపు పటిష్టమైన చెన్నై.. మరోవైపు బౌలింగ్ నైపుణ్యంతో హైదరాబాద్.. ఆదివారం వాంఖడేలో జరిగే టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
2010, 2011లో టైటిల్స్ను నెగ్గిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్ను కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే 2016లో విజేతగా నిలిచిన హైదరాబాద్ దానిని డబుల్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఓవరాల్గా కొదమసింహాల్లాంటి రెండు మేటి జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగడం ఖాయంగా కనిపిస్తున్నది.
భీకర బౌలింగ్ వనరులున్నప్పటికీ ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒక బ్యాట్స్మన్ అసాధారణంగా ఆడుతుండటంతో సూపర్ కింగ్స్ను సన్రైజర్స్ లొంగదీసుకోలేకపోతోంది. లీగ్ మ్యాచ్లలో రెండుసార్లూ అంబటి రాయుడు దెబ్బ కొట్టగా, క్వాలిఫయర్లో ఆ పనిని డు ప్లెసిస్ చేశాడు. సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య ఈ మూడు ఇన్నింగ్స్లే తేడా చూపాయి.
కీలకమైన వాట్సన్, రాయుడితో పాటు రైనా, డు ప్లెసిస్లను త్వరగా ఔట్ చేస్తే చెన్నై జోరును తగ్గించినట్లవుతుంది. ధోని, బ్రేవోలపైకి రషీద్ ఖాన్ను ప్రయోగించి ఫలితం రాబట్టొచ్చు. అయితే, ఎప్పటిలానే హైదరాబాద్ బ్యాటింగ్ సామర్థ్యం మరోసారి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. శుక్రవారం క్వాలియఫర్–2లో రషీద్ ఇన్నింగ్స్ లేకుంటే కథ అక్కడితోనే ముగిసిపోయేది. దీంతోపాటు తుది జట్టు కూర్పుపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. తీవ్రంగా నిరాశ పరుస్తున్న మనీశ్ పాండేను కాదని దీపక్ హుడాను, పేసర్ సందీప్ శర్మ స్థానంలో ఖలీల్ అహ్మద్ను, కీపర్ గోస్వామి బదులు వృద్ధిమాన్ సాహాను ఆడించి గత మ్యాచ్కు ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగింది.
నమ్మదగిన ఓపెనర్లు, ఎలాంటి మ్యాచ్నైనా అనుకూలంగా ముగించగల కెప్టెన్, అతడికి తోడుగా నిలకడైన ఆల్రౌండర్లు, పదునైన పేసర్లు, పదో నంబరు వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు… ఇలా ఏ విధంగా చూసినా చెన్నై పెద్ద పర్వతంలా కనిపిస్తోంది. గత మ్యాచ్లో బిల్లింగ్స్ను కాదని డు ప్లెసిస్కు చోటివ్వడాన్ని మొదట అందరూ తప్పుబట్టారు. కానీ, అతడు ఆడిన ఇన్నింగ్స్తో ముక్కున వేలేసుకున్నారు.మరి ఐపీఎల్ కప్ ఎవరు గెలుస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.