వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ జట్టు భారీ స్కోరుతో ఢిల్లీ డేర్డెవిల్స్కి సవాల్ విసిరింది. ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ (53: 32 బంతుల్లో 7×4, 1×6), ఎవిన్ లావిస్ (48: 28 బంతుల్లో 4×4, 4×6)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ (44: 23 బంతుల్లో 4×4, 2×6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో మిడిలార్డర్లో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రోహిత్ (18: 15 బంతుల్లో 2×4) మరోసారి నిరాశపరచగా.. కీరన్ పొలార్డ్ (0), క్రునాల్ పాండ్య (11), హార్దిక్ పాండ్య (2) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఓపెనర్లు దూకుడుగా ఆడిన 9 ఓవర్లకే 102 పరుగులు చేసి ఉండటంతో.. ముంబయి జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది.
ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలో దిగిన రోహిత్.. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ను తన బదులు ఓపెనింగ్కు పంపాడు. రోహిత్ వ్యూహం ఫలించింది. ఐపీఎల్ కెరీర్లోనే తొలిసారి ఓపెనన్గా బరిలో దిగిన సూర్య కుమార్ యాదవ్తోపాటు లెవిస్ బౌండరీలతో చెలరేగారు.
ఓపెనర్లు బౌండరీల మోత మోగించడంతో పవర్ ప్లేలో ముంబై జట్టు వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పవర్ ప్లే ముగిశాక వీరద్దరి జోరు తగ్గింది. కానీ 8.4 ఓవర్లో తొలి వికెట్కు 102 పరుగులు జోడించారు. ఈ ఏడాది ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.