భారత క్రికెట్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. అది క్రికెట్ అభిమానులకు మధుర జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికాలో ఒకేరోజు భారత పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. అసాధారణ ఆటతీరుతో సఫారీలను వారి గడ్డపై భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి
సౌతాఫ్రికాలో భారత క్రికెట్ జట్లు భారీ స్కోరుతో సత్తాచాటాయి. సఫారీ సేనపై టీమిండియా 303 పరుగుల భారీ స్కోరు చేయగా, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుపై భారత మహిళా క్రికెట్ జట్టు 302 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా ఓపెనర్ ధావన్ (76), కెప్టెన్ విరాట్ కోహ్లీ (160*) ఫస్ట్ డౌన్ లో చెలరేగి ఆడి సెంచరీ చేయగా, మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (135) సెంచరీతో సత్తా చాటింది. కీలక బ్యాట్స్ ఉమన్ హర్మన్ ప్రీత్ కౌర్ (55*), వేద కృష్ణమూర్తి (51*) రాణించారు. దీంతో సౌతాఫ్రికా మహిళా జట్టు 178 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇక టీమిండియా 124 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. రెండు వన్డే విజయాలతో మహిళా క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకోగా, మూడు వన్డే విజయాలతో టీమిండియా వన్డే వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ వన్డేల ద్వారా జులన్ గోస్వామి 200 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్ గా నిలవగా, సఫారీ గడ్డపై వరుస వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్ గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.