భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి.. కెప్టెన్సీ పగ్గాలు వదిలేసినా ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు. తాజాగా ధోని ఆదాయపు పన్ను చెల్లించడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 వార్షిక సంవత్సరానికి జార్కండ్లో అత్యధిక పన్ను చెల్లించి వ్యక్తిగా ధోని నిలిచాడు.
తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ తాజాగా రూ. 12.17 కోట్లు టాక్స్ కట్టినట్లు ఝార్కండ్ ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 2017-18 వార్షిక సంవత్సరానికి ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ పన్ను చెల్లించలేదని అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రూ.1.24 కోట్లు అధికంగా ధోనీ చెల్లించినట్లు తెలిపారు.
పన్ను చెల్లించడమే కాకుండా, రానున్న వార్షిక ఆదాయానికి సంబంధించి సుమారు మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ను ముందే డిపాజిట్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ఎక్కువగా ఆర్జించే భారత క్రికెటర్ల జాబితాలో ధోని మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
2016 ఆరంభంలో భారత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గత ఏడాదంతా బీసీసీఐ నుంచి ఎ గ్రేడ్ స్థాయిలో వేతనాన్ని అందుకున్న ధోనీ.. ఈ ఏడాది బోర్డు కొత్తగా ఎ+ గ్రేడ్ను తీసుకొచ్చినా.. ఈ మాజీ కెప్టెన్ ఎ గ్రేడ్కే పరిమితమయ్యాడు. ప్రకటన రూపంలో మునుపటి స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్న ధోనీ.. పన్ను కట్టడంలోనూ నిజాయితీగా వ్యవహరిస్తున్నాడు.