వరల్డ్ కప్లో అంబటి రాయుడును సెలక్ట్ చేయకపోవడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై స్పందించలేదు. తాజాగా విండీస్ టూర్ జట్టు ప్రకటన సందర్భంగా రాయుడిపై స్పందించారు. ‘టీ 20ల్లో అతడి ప్రదర్శనను పరిశీలించిన తర్వాత రాయుడును వన్డేల్లోకి తీసుకున్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ, మేం అతడి గురించి కొన్ని ఆలోచనలు చేశామన్నారు.
ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయినప్పుడు అతడిని శరీరదారుఢ్య ప్రోగ్రాంకి పంపాం. కొన్ని కాంబినేషన్స్ వలన వరల్డ్ కప్కు అతడిని సెలక్ట్ చేయలేదన్నారు. అంతే కాని రాయుడిపై ఎలాంటి వివక్షలేదన్నారు.ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ కప్కు ఎంపిక చేసిన జట్టులో అంబటిరాయుడుకు చోటు దక్కలేదు. ఆ తర్వాత శిఖర్ ధావన్ గాయం కారణంగా తప్పుకొన్నాడు. ధావన్ ప్లేస్లో రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చింది సెలక్షన్ కమిటీ. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాయుడు క్రికెట్కు గుడ్ బై చెప్పారు.
ప్రపంచ కప్లో ధావన్ గాయపడ్డాక జట్టు మేనేజ్మెంట్ ఎడంచేతి ఆటగాడు కావాలని కోరిందని, అందుకే పంత్ను పంపామని, ఇక ఓపెనర్ రాహుల్కు బ్యాకప్గా మయాంక్ను తీసుకున్నామని ఎమ్మెస్కే వివరించాడు. ఇందులో పూర్తి స్పష్టతతో వ్యవహరించామని తెలిపాడు.