సెమీస్లో బెర్త్ కన్ఫమ్ చేసుకోవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చెస్టర్లీ స్ట్రీట్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో అన్ని విభాగాల్లోనూ రాణించిన ఆతిథ్య జట్టు 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది.
ఇక ఇంగ్లండ్ నిర్దేశించిన 306 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యఛేదనలో కివీస్ బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు. టామ్ లాథమ్(57; 65 బంతుల్లో 5 ఫోర్లు)మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. వోక్స్, రషీద్, స్టోక్స్, ఫ్లంకెట్, ఆర్చర్లు తలో వికెట్ పడగొట్టారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆరంభంనుంచె అదరగొట్టింది. ఓపెనర్లు తొలి వికెట్కు 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, కివీస్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు ఆశలు నీరుగారి 305 పరుగులకు సరిపెట్టుకుంది. బెయిర్స్టో (106) సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ జాసన్ రాయ్ (60) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మోర్గాన్ 42 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్, నీషమ్, హెన్రీలు విజృంభించి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.
306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్ప కూలింది. ఇంగ్లండ్ గెలిచి సెమీస్ చేరుకోగా ఓడినా న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.