భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కష్టాలు మరిన్ని పెరిగాయి. భార్య హసీన్ జహాన్ గృహహింస ఆరోపణలు, బీసీసీఐ కాంట్రాక్ట్ నిలిపివేత, పోలీసు కేసుల నమోదు అనంతరం ఇప్పుడు క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) రంగంలోకి దిగిన విషయం తెలిసందే. తాజాగా కేసులో మరో కీలక పరిణామం చోటచేసుకుంది.
సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ కి కోల్ కతాలోని లాల్ బజార్ పోలీస్ స్టేషన్ లో తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పంపించింది. వివాహేతర సంబంధాలు, గృహహింస, హత్యాయత్న, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నేరాలకు షమీ పాల్పడ్డాడంటూ హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఓఏ షమీపై విచారణ ఆరంభించింది.
అయితే భార్య చేసిన ఆరోపనలపై షమీ స్పందించారు. తన భార్య తనను మోసం చేసిందని . మొదటి వివాహం విషయం దాచిపెట్టిందని పేర్కొన్నాడు. తానెన్నడూ తప్పు చేయలేదని, చేసినట్టు రుజువైతే ఉరితీయాలని కోరాడు. ఈ నేపథ్యంలో హసీన్ తరపు లాయర్ షమీపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సీఓఏ ఛైర్మన్ కు పంపారు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో చూడాలి. భార్యతో కోర్టు వెలుపల సంధి చేసుకుంటానని ప్రకటించిన షమీ, ఆమెపై ఆరోపణలు చేయడంతో ఎఫ్ఐఆర్ ను సీఓఏ ఛైర్మన్ కు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షమీపై బీసీసీఐ అవినీతి నిరోధకశాఖ విచారనను ప్రారంభించిన సంగతి తెలసిందే. ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసకుంటాయో చూడాలి.