సుదీర్ఘ చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో టాస్ అంతర్భాగమని.. కాబట్టి టాస్ పద్ధతిని రద్దు చేయడం కుదరదని అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ స్పష్టం చేసింది. ఆతిథ్య జట్లు టెస్టు మ్యాచ్ల సమయంలో తమకి అనుకూలమైన పిచ్లను తయారు చేసుకుని అదనపు లబ్ధి పొందుతున్నాయని.. దీన్ని నివారించేందుకు టాస్ పద్ధతిని రద్దు చేసి పర్యాటక జట్టుకి బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ని ఎంచుకునే వెసులబాటు కల్పించాలని ఇటీవల ఓ ప్రతిపాదన తెచ్చారు. దీనిపై చర్చించేందుకు కూంబ్లే నేతృత్వంలో ఐసీసీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
1877లో అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టాస్ విధానం అమల్లో ఉంది. ఈ విధానం వల్ల ఆతిథ్య జట్టు సారథి టాస్ కాయిన్ను గాల్లోకి వేసే బాధ్యతను స్వీకరిస్తుండగా… పర్యాటక జట్టు సారథి హెడ్ మరియు ట్రయల్ కోరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆతిథ్య జట్టు సారథి కాయిన్ను పైకి విసిరే క్రమంలో హెడ్ మరియు ట్రయల్ ఫలితం తేలేవిధంగా కాయిన్ వేయడం జరుగుతోందని ఐసిసి అభిప్రాయపడింది.
టాస్ రద్దు ప్రతిపాదనపై భారత మాజీ క్రికెటర్లతో పాటు చాలా మంది విదేశీ మాజీ క్రికెటర్లు సైతం పెదవివిరిచారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని అలానే కొనసాగించాలని సూచించారు. దీనిపై సుదీర్ఘంగా అనిల్ కుంబ్లేతో కలిసి చర్చించిన ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యులు మైక్ గాటింగ్, మహేల జయవర్దనె, మైక్ హేసన్, డేవిడ్ బూన్ పాత పద్ధతికే ఓటేశారు. మైదానంలో క్రమశిక్షణ తప్పే క్రికెటర్లు, బాల్ టాంపరింగ్ లాంటి తప్పులకి ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలని ఐసీసీకి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సూచించారు.