రైతులకు మద్దతుగా గుంటూరులో రైతు దీక్ష చేపట్టిన జగన్ సీఎం చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. మండే ఎండల్ని లెక్క చేయకుండా.. ఈ రోజు.. రేపు రెండు రోజుల పాటు రైతుదీక్ష చేసేందుకు ఆయన రెఢీ అయ్యారు. గుంటూరు మిర్చియార్డుకు సమీపంలో రైతుదీక్షను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా బాబు పాలన తీరుపై మండిపడ్డారు. మిర్చి ఘాటుకు సరిపోయేలా ఉండే ప్రశ్నలు సంధించారు బాబు గారికి.
కడుపు మండి… పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకునే పరిస్థితి లేదు. కడుపులో బాధను.. మన అవస్థల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని.. ఆయనకు బుద్ధి రావాలని రైతులంతా ఒక్కచోట ఏకమై దీక్షను చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. రైతులతో పని అయిపోయిన తర్వాత.. ఆయన మరోలా మాట్లాడుతున్నారన్నారు.
2010లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర చంద్రబాబు ధర్నా చేశారు.. హూడా కమిటీ సిఫార్సులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని కష్టాల్లో ఉన్న రైతులకు ఎకరాకు రూ.10-15 వేలు ఇవ్వాలని దీక్ష చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హూడా కమిటీ సిఫార్సులు కనిపించాయి కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవేవి కనిపంచడంలేదు.ఎన్నికల వేళ.. రైతుల కోసం రూ.5 వేల కోట్లతో స్థిరీకరణ నిధి తీసుకొస్తామన్న బాబు మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయే చెప్పాలన్నారు.ఇదే చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులకు కనీస మద్దతుధర చాలా తక్కువగా ఉందని.. అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తామని.. వ్యవసాయ ఖర్చు మీద 50 శాతం లాభం వేసి మరీ ధర ఇప్పిస్తానన్నారు. చివరికి 50.. 60 రూపాయల చొప్పున ముష్టి వేసినట్లు ఇస్తున్నారు.
2013-14లో వరుస తుఫాన్లు వచ్చాయి. కానీ సీఎం అయిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్క ఇన్పుట్ సబ్సిడీ అక్షరాలా రూ.4394 కోట్లు బకాయిలు పడ్డారు. వరుసగా మూడేళ్లలో ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేయించారు. కోటి 4 లక్షల అకౌంట్లకు గాను 40 లక్షల రైతుల అకౌంట్లు ఓవర్ డ్యూ.. ఎన్పీఏ అకౌంట్లుగా తయారయ్యాయి. బాబు పాలన చూసి తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇదే మిర్చియార్డుకు ఐదువారాల క్రితం వచ్చా. అప్పుడు మిర్చి రేటు క్వింటాలుకు రూ.6000-7000 వరకు పలుకుతోందిఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. కేవలం ఐదు వారాల వ్యవధిలో రూ.ఆరేడు వేలున్న మిర్చి క్వింటాళ్ల ధర ఇప్పుడు రూ.2500-4000కు రేటు పడిపోయింది. ఎక్కడైనా సీఎం అంటే.. రైతులకు తోడుగా ఉండేందుకు స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో పోటీ సృష్టించాలి. కానీ చంద్రబాబు రైతులకు తోడుగా నిలబడలేదు.. వ్యాపారులకు అండగా నిలిచారు. వ్యాపారులు కొంటే.. ఈయన ముష్టేసినట్లు రూ.1500 ఇస్తారట. అది కూడా 8వేలకు ఎంత తక్కువైతే అంతే ఇస్తారట. ఇదెక్కడి న్యాయం ని ప్రశ్నించారు. మరి జగన్ సంధించిన ఈప్రశ్నలకు బాబు ఆయన బ్యాచ్ ఏం సమాధానం చెప్తారో మరి.
{youtube}UogEnqnZwCk{/youtube}
Related