చాలా మంది సాధారణంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో నోటిపూత ఒకటి. అంటే నోటిలో చిన్న చన్న పుండ్లు ఏర్పడటం. దీని కారణంగా అధికంగా నొప్పి కలుగుతుంది. ఆహారం తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక్కో సారి పరస్థితి దారుణంగా మారి నీరు తాగినా,.. నోరు తెరిచి మాట్లాడినా మంట (నొప్పి) పుడుతుంది. నోటిపూతకు ప్రధాన కారణం శరీరంలో అధికంగా వేడిమి ఉండటం. ఒక్కోసారి మన ఆహార అలవాట్లలో మార్పులు, ఒత్తిడి కారణంగా కూడా నోటిపూత సమస్య ఏర్పడుతుంది.
ఈ సమస్యను కొన్ని వంటింటి చిట్కాలతో ప్రారంభంలోనే తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఆ విషయాలు మీ కోసం.. నోటిపూత నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొత్తిమీరను నీటిలో నానాబెట్టి లేదా ఉడకబెట్టి తాగాలి. కొబ్బరి పాలు సైతం నోటిపూతను తగ్గించడంలో మంచి ఫలితాలు చూపిస్తాయి. అలాగే అప్పుడప్పుడు పసుపు నీటితో పుక్కిలించడం వల్ల కూడా నోటిపూత తగ్గిపోతుంది.
తులసి వల్ల అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయని ఇదవరకే పలు అధ్యయనాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి తులసి ఆకులను నోరు, గొంతు సమస్యలు ఉన్నప్పుడు నమలడం, మింగడంతో నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలతో తయారైన పదర్థాలు కూడా ఈ విషయంలో మెరుగ్గా ఉంటాయి. స్వచ్ఛమైన నెయ్యిని నోటిలో ఏర్పడే పుండ్లపై రాస్తే తగ్గుతాయి. అలాగే, నారింజ రసం, పెరుగు, పాలు, జున్ను పదర్థాలను నిత్యం ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అంది నోటిపూత రాకుండా రక్షణ కల్పింస్తాయి.