మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రష్యా తయారుచేసిన స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్కు ఇప్పటికే మనదేశంలో అనుమతులు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ క్రమంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీ కేంద్రాల్లో కూడా పంపిణీ చేయనున్నట్టు సమాచారం.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ టీకా ఒక్కో డోసు ధర రూ.1,145గా నిర్ణయించారు. మనదేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం భావిస్తున్నది. గతంలో వ్యాక్సినేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించడంతోనే సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం థర్డ్వేవ్పై భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ పై ఆందోళన ఉంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ వేగంగా చేస్తేనే కరోనాను కట్టడి చేయగలమంటూ డబ్ల్యూహెచ్వో సైతం సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నది.
Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!
స్పుత్నిక్-వీతో పాటు మోడర్నా, జైడస్ క్యాడిలాతో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. మనదేశంలో ప్రస్తుతం కోవాక్జిన్, కోవిషీల్డ్ తయారవుతున్నాయి. అయితే మనదేశ జనాభాకు సరిపడా వీటి ఉత్పత్తి లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను రష్యా తయారుచేయగా.. దేశీయంగా రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 మిలియన్ల వ్యాక్సినేషన్ పంపిణీ చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 10 మిలియన్లకు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్ సీలలో సైతం పంపిణీ చేయనున్నారు.
Also Read: కరోనా వ్యాక్సిన్తో వ్యంధ్యత్వం.. నిజమెంత?