టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి టెస్టుల్లోకి పునరాగమనం చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐనుంచి పిలుపు అందింది.విండీస్ టూర్ లో రాహుల్ పూర్తిగా ఫెయిల్ అవడంతో ఆ అవకాశం ఇప్పుడు రోహిత్ కు వచ్చింది. అతని స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.
వెస్టిండీస్ పర్యటనలో ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టులో రాహుల్ వరుసగా 44, 38, 13, 6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆంటిగ్వాలో జరిగిన తొలి టెస్టులో మంచి ఆరంభం లభించినప్పటికీ వాటిని భారీ ఇన్నింగ్స్లుగా మలచడంలో చేతులెత్తేశాడు.
ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్లో కనీసం తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు రోహిత్ శర్మ. రోహిత్ ను తీసుకోకపోవడంతో అభిమానులు టీమిండియా కెప్టెన్ మీద విమర్శలు చేశారు. దీంతో దక్షిణాఫ్రికాతో అక్టోబరు 2 నుంచి ప్రారంభంకానున్న మూడు టెస్టుల సిరీస్లో అవకాశం ఇచ్చే దిశగా రవిశాస్త్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
వన్డే, టీ20ల్లో తిరుగులేని ఓపెనర్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక విండీస్ టూర్ లో స్థానం దక్కించుకున్న హనుమ విహారి ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచి జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాపై సిరీస్లో రాహుల్పై వేటు వేసి అతని స్థానంలో రోహిత్ శర్మకి ఓపెనర్గా అవకాశమివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.రాహుల్తో ఓపెనర్గా బరిలో దిగిన అంతగా అనుభవంలేని మయాంక్ అగర్వాల్ ఫర్వాలేదనిపించాడు. అతనికి మరికొన్ని అవకాశాలు ఇస్తే నిలదొక్కుకొని సత్తాచాటగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.