నిర్మానుష్యంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్, మూసాపేట
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్, మూసాపేట ఏరియాలు నిర్మానుష్యమయ్యాయి. థియేటర్లు మూత పడడంతో ఆ ఏరియాల్లో జనాల సందడి లేకుండాపోయింది. వీపీఎఫ్ చార్జీలకు వ్యతిరేకంగా నేటి నుంచి (మార్చి 2వ తేదీ) సినిమా ప్రదర్శనలు ఆగిపోయాయి. నిరవధిక బంద్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాక తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ప్రారంభమైంది.
ఐదు రాష్ట్రాల సినీ పరిశ్రమ నిర్మాతలు, దర్శకులు అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడంతో విజయవంతంగా బంద్ కొనసాగుతోంది. మల్టీప్లెక్స్, సాధారణ థియేటర్లు మూతపడిపోయాయి. దీనికి థియేటర్ల యాజమాన్యం కూడా మద్దతు పలకడంతో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. వీపీఎఫ్ చార్జీలను క్రమంగా ఎత్తివేయాలని, విరామ సమయంలో ప్రదర్శించే రెండు ప్రకటనల్ని సినిమా పరిశ్రమకు ఇవ్వాలని పంపిణీదారులు, ప్రదర్శనదారులు, నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.
– డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ప్రాంతీయ సినిమాలకు వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) తగ్గించాలి అనేది ప్రధాన డిమాండ్
– డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డీఎస్పీ) రెచ్చిపోతున్నారని.. గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
– క్యూబ్ – యూఎఫ్ఓలకు కంటెంట్ కూడా ఇవ్వకూడదని నిర్మాతలు నిర్ణయించారు.
సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఈ బంద్ నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఎప్పటికీ థియేటర్లు ఓపెన్ అవుతాయో చూడాలి. థియేటర్ల బంద్ అందరికీ చాలా నష్టం ఏర్పడుతోంది. థియేటర్ ప్రదర్శనలను ఆసరా చేసుకొని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. థియేటర్ బంద్ వారి ఉపాధికి తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంది.