మోడీ ఎఫెక్ట్ సినిమాలపై దారుణ ప్రభావాన్ని చూపుతోంది. రెండ్రోజుల నుంచి.. థియేటర్లో సినిమా చూసే నాధుడే కరవయ్యాడు. ఈరోజు విడుదలైన సినిమాలు కూడా ప్రేక్షకులు లేక విలవిలలాడిపోతున్నాయి. ఈ రోజు విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో కి జనాలే లేరు. హైదరాబాద్లోనే కాదు, ప్రధాన నగరాల్లో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు బోసిగా కనిపిస్తున్నాయి. గత వారం విడుదలైన సినిమాలనైతే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.
కొన్ని చోట్ల షోలూ రద్దు చేశారు థియేటర్ యజమానులు. సాధారణంతో పోలిస్తే 70 శాతం వసూళ్లు తగ్గిపోయాయని నిర్మాతలు, పంపిణీదారులు లెక్కగడుతున్నారు. ఈ ఎఫెక్ట్ ఈవారం విడుదలైన సినిమాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. బ్యాంకుల ముందు, ఏటీఎమ్ సెంటర్ల ముందు జనం బారులు తీరడం కనిపిస్తోంది. గంటలు గంటలు క్యూలో నిలబడి.. అలా వచ్చిన డబ్బుని పొదుపుగా దాచుకొంటారా? లేదంటే సినిమాలకూ షికార్లకూ ఖర్చు పెడతడా? అందుకే.. ఇలాంటి సమయాల్లో కలక్షన్లు కురిపించుకోవాలన్న నిర్మాతలదీ అత్యాసే అనుకోవాలి. ఈ ఎఫెక్ట్ మరో వారం రోజులు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. అంతేకాదు.. రెండ్రోజులుగా షూటింగ్లు క్యాన్సిల్ అయ్యాయి.
సోమవారం వరకూ చాలా యూనిట్లు షూటింగ్లు జరపం.. అని నిర్ణయించుకోవడం విశేషం. రోజువారీ వేతనాలతోనే బతుకు వెళ్లగక్కుకొనే జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్లు, లైట్స్ బోయ్.. సినిమాలపై పరోక్షంగా ఆధారపడే వేలాది మంది జీవితాల్లో పెద్ద నోట్ల రద్దు పెద్ద అలజడినే సృష్టిస్తోంది. ఈ స్థబ్తత ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి. కొంతమంది నిర్మాతలు మాత్రం..“ఓ వారం పది రోజుల్లో వ్యవహారాలన్నీ కొలిక్కి వస్తాయి. అంత వరకూ ఓపిక పట్టాలి“ అంటున్నారు. అయితే.. ఇదే అదునుగా ఐటీ శాఖ కొంతమంది నిర్మాతల్ని టార్గెట్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే బాహుబలి ఆఫీసులో రైడ్లు మొదలయ్యాయి. బాహుబలి సినిమాకు సంబంధించి జమా ఖర్చులన్నింటినీ ఐటీ శాఖ పరిశీలిస్తోంది. మున్ముందు మరింత మంది ప్రొడ్యూసర్ల ఇంటి తలుపులు తట్టడానికి ఐటీ శాఖ సమాయాత్తం అవుతోంది. ప్రొడ్యూసర్లూ.. పారా హుషార్.