- ఇటీవల తరచూ వింటున్న మాట
- విశాఖ, బెజవాడకు సినీ పరిశ్రమ తరలింపు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా రెండు రాష్ట్రాలు ఏర్పడడంతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన కష్టమేమి లేదు. తెలుగు ప్రేక్షకులు అలాంటి వివక్షను ఏమి చూపడం లేదు. అందరినీ ఆదరిస్తున్నారు. తెలంగాణ సినిమాలను ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలోనే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పూల స్వాగతం పలికారు. జై బోలో తెలంగాణ సినిమా విడుదల సమయంలో అక్కడ కూడా ప్రజలు చూసి సినిమాను బతికించారు. పొడుస్తున్న పొద్దుమీద పాటకు వాళ్లు పాదం కలిపారు. అలాంటి తెలుగు పరిశ్రమను విభజిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తామని ఇటీవల వినిపిస్తున్నమాటలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో రాజధాని అమరావతి సమీపంలో లేదా విశాఖపట్టణంలో సినీ పరిశ్రమను నెలకొల్పుతామని ఆ ప్రభుత్వం అంటున్న మాట. దానికనుగుణంగా సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వారితో సమాలోచనలు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా సినీ పరిశ్రమను ఆయనకు తోచిన మాదిరి సహాయం చేస్తున్నారు. రుద్రమదేవి, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలకు పన్ను మినహాయింపు కల్పించి ప్రత్యేకత చాటారు. ఇక తరచూ సినీ ప్రముఖులతో టచ్లో ఉన్నారు. సినీ పరిశ్రమకు రామోజీ ఫిల్మ్ సిటీలాంటిది హైదరాబాద్ సమీపంలో ప్రభుత్వం నిర్మించి ఇస్తదని, సినీ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, వారి కష్టాలు తీరుస్తామని తరచూ చెబుతున్నమాట. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఎప్పుడూ సినీ పరిశ్రమకు చెందిన వారితో టచ్లో ఉన్నారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది.
ఈ విధంగా రెండూ ప్రభుత్వాలు పోటాపోటీగా సినీ పరిశ్రమలకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే సమయంలో సినీ పరిశ్రమ విభజన అవసరమా అని అందరిలో మెదలుతున్న ప్రశ్న. మద్రాస్ నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి చాలా కాలం పట్టింది. మళ్లీ అలాంటి పరిస్థితి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇరు ప్రభుత్వాలతో సినీ పరిశ్రమకు వచ్చిన చిక్కేమి లేదు. మరీ ఎందుకీ విభజన? ఈ పరిశ్రమను విభజించినంత మాత్రాన ఏం గొప్ప మార్పు ఉండదు. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉన్నంతవరకు బాగుపడదు. ఇప్పుడు ఈ విభజనను కోరుకుంటున్నది కూడా ఆ వర్గమే.
లబ్ధి వారికే..
వారి వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విభజన చేస్తే వారు బాగా లబ్ధి పొందుతారు. ప్రభుత్వం ఎక్కడా అనేది నిర్ణయిస్తే ఇప్పటికిప్పుడే అక్కడ నిర్మాణాలు చేసుకునేందుకు వాళ్లు ఎదురుచూస్తున్నారు. థియేటర్లు నిర్మించుకొని, స్టూడియోలు ఏర్పాటుచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ విధంగా వారికే లబ్ధి ఉంటుంది. కానీ సామాన్య సినీ కార్మికులకు ఎలాంటి లాభం ఉండదు.
ఇరు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న అవకాశాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటే పోతే పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమ అనేది ఒకచోట అభివృద్ధి కాకుండా అక్కడ ఇక్కడ చేస్తూ పోతే సరిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే మాదిరి జరిగింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్లు బాగా జరిగాయి. ఇప్పుడు అలానే ఉంది పరిస్థితి. కాకపోతే సినీ పరిశ్రమ రాష్ర్ట విభజన తర్వాత కొంచెం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందుకే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు విజయవంతమయ్యాయి. పెళ్లిచూపులు, ఫిదా తదితర సినిమాలు కొంచెం తెలంగాణ నేపథ్యంలో ఉన్నాయి. అందుకే చంద్రబాబునాయుడు సినీ పరిశ్రమపై దిగులు పడి ఏపీలో కూడా పరిశ్రమకు అవకాశాలు కల్పించాలని కసిగా ఉన్నారు.