అవినీతి కేసుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న చంద్రబాబు సంగతి తెలిసిందే. ఇప్పటికు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు కాగా తాజాగా ఫైబర్ నెట్ స్కాంలో కూడా పీటీ వారెంట్ జారీ కావడంతో బాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువ.
ఈ నేపథ్యంలో టీడీపీని గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్నారు బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మాణి. అయితే ఈ ముగ్గురిలో ప్రధానంగా బ్రాహ్మాణి పేరునే టీడీపీ నేతలు జపం చేస్తున్నారు. ఎందుకంటే ఫైబర్ నెట్వర్క్ స్కాంలో బాబును ఏ1గా చేర్చగా లోకేష్ పేరును ఇప్పటికే ఈ కేసులో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ని త్వరలో అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే లోకేష్ పాత్రను బ్రాహ్మణి పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు నుండి బ్రాహ్మణి రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ కార్యక్రమాలను మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాణీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా తాజాగా ఆమె ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో లోకేష్ తరపున మంగళగిరిలో బ్రాహ్మణి రోడ్డుషోలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిన నేపథ్యంలో బ్రాహ్మణి ఎన్నికల్లో పోటీచేస్తారనే ప్రచారం జోరందుకోగా మంగళగిరిలో పోటీచేస్తారా లేకపోతే మరె స్ధానం నుండైనా బరిలోకి దిగుతారా అన్నది తెలియాల్సి ఉంది.