తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. పటాన్ చెరు, నారాయణ ఖేడ్ టికెట్ల అంశం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా మధ్య నిప్పు రాజేసింది. తాను సూచించిన అభ్యర్థులు కాట శ్రీనివాస్, సంజీవరెడ్డికి కాకుండా నీలం మధు, సురేష్ షెట్కార్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న దామోదర కాంగ్రెస్కు రిజైన్ చేస్తున్నట్లు వార్తలు రాగా కాంగ్రెస్ పెద్దలు ఆయనతో మాట్లాడారు.
ఇక పటాన్ చెరు టికెట్ తనకు దక్కకపోవడంపై అసంతృప్తిలో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ మారే ఆలోచనలో ఉండగా సంజీవరెడ్డి సైతం ఇవాళ తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పటాన్చెరు టికెట్ కేటాయింపులో తనపై దుష్ప్రచరం తగదని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పటాన్చెరు విషయంలో దామోదర తనను కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఒకవేళ టికెట్ మారిస్తే నా నిర్ణయం నేను తీసుకుంటానని తేల్చిచెప్పారు.
ఇక పటాన్ చెరు టికెట్ దక్కించుకున్న నీలం మధు మాత్రం కాట శ్రీనివాస్ తో కలిసి పనిచేస్తానని…కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. మరి పటాన్చెరు వ్యవహారం జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహాగా మారగా ఈ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో వేచిచూడాలి.