తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీట్లు దక్కని నేతలు పార్టీని వీడగా తాజాగా రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్కు సన్నిహిత నేతగా మనోహర్ రెడ్డికి పేరుంది.
బీఆర్ఎస్ ప్రకటించిన ఫస్ట్ లీస్ట్లో తాండూరు టికెట్ ఆశీంచారు కానీ నిరాశే ఎదురైంది. అప్పటినుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు మనోహర్ రెడ్డి. అయితే ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ, తాండూరు టికెట్ పై స్పష్టమైన హామీ రావడంతో ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్, బీజేపీలవైపు చూస్తున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల విరేశం ఇప్పటికే పార్టీని వీడారు. మైనంపల్లికి మల్కాజ్గిరితో పాటు మెదక్ అసెంబ్లీ స్ధానాలపై కాంగ్రెస్ నుండి స్పష్టమైన హామీ లభించగా నకిరేకల్ స్ధానాన్ని వేముల విరేశంకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే బాటలో మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్,బీజేపీ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఈ రెండు పార్టీల నుండి బీఆర్ఎస్కు వలసలు పెరిగే అవకాశం ఉంది.