తీవ్ర తర్జనభర్జనల అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. రేవంత్ను సీఎల్పీ నేతగా కాకుండా చేసేందుకు చివరి వరకు సీనియర్లు చేసిన ప్రచారం విఫలమైంది. ముఖ్యమంత్రిగా ఈనెల 7న ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుండగా అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
ఇక కాంగ్రెస్ విజయంలో ఎవరు ఒప్పుకున్న ఒప్పుకొకపోయిన రేవంత్ రెడ్డిదే కీలక పాత్ర. ఓ వైపు రెండు స్థానాల్లో కొడంగల్, కామారెడ్డిలో ప్రచారాన్ని సమన్వయం చేస్తూనే తెలంగాణ చుట్టివచ్చారు రేవంత్. కాంగ్రెస్ సీనియర్ నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వారి వారి నియోజకవర్గాలకే పరిమితమైన రేవంత్ మాత్రం ఒక్కడిగానే ప్రచారాన్ని హోరెత్తించారు.
ప్రచారంతో పాటు పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో రేవంత్కు ఎదురైన ప్రధాన ప్రశ్న. ఎలాంటి పరిపాలన అనుభవం లేని రేవంత్ సీఎం ఎలా అవుతారు. దీనికి ఇప్పుడు రేవంత్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి(GM)లాంటిది…ప్రభుత్వం నడపటం అనేది గుంపు మేస్త్రీ లాంటిది.. సీఎంగా చేయడానికి గుంపు మేస్త్రీగా నాకు ఉన్న అనుభవం సరిపోతుందని చెప్పుకొచ్చారు. ఇళ్లు కట్టాలంటే మనకే పెయింటర్, తాపి మేస్త్రి,బండలు వేసే వారు అయి ఉండాల్సిన అవసరం లేదని..వారిని ఎలా నడిపించాలో తెలిస్తే చాలని..మేస్త్రి పాత్ర కీలకమని తెలిపారు. తనకు ఆ అనుభవం ఉందని ఆ అనుభవంతోనే సీఎం పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ను సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.