తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో సీడ్యబ్లూసీ సమావేశాలు నిర్వహించడం ఇక సెప్టెంబర్ 17 సందర్భంగా భారీ బహిరంగసభను నిర్వహించింది. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరుకాగా సోనియా గాంధీ,రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలందరూ హాజరయ్యారు. బహిరంగసభ వేదికపై నుండే ప్రజలందరికి అభివాదాలు చేశారు.
అనంతరం ఎన్నికల శంఖారావన్ని పూరిస్తూ కీలకమైన 6 స్కీమ్లను ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటకలో 5 స్కీములను ప్రకటించగా తెలంగాణలో 6 స్కీములను ప్రకటించారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇంటి పథకం, యువ వికాసం పథకం, చేయూత పెన్షన్ పథకంలను ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు పథకాలను అమలు చేస్తామని బహిరంగసభ వేదికపైనుండి నేతలు ప్రకటించారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వనుండగా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందించనున్నారు.
ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారని…చేయూత పెన్షన్ పథకం కింద నెలకు రూ.4,000 చొప్పున అందించనున్నారు. అలాగే రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించనుండగా రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందనున్నాయి.
అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజీ వర్కవుట్ అయింది. మరీ ఇదే స్ట్రాటజీ తెలంగాణలో వర్కవుట్ అవుతుందా అంటే వేచిచూడాల్సిందే.