పండుగ సీజన్ వచ్చేస్తోంది. ఇ-కామర్స్ సైట్లూ ఇప్పటికే ఆఫర్లతో గాలం వేయడం మొదలుపెట్టాయి. ఇక కష్టమర్లు కూడా ఎగబడి ఆన్లైన్ షాపింగ్ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ వెనుకున్న మతలబు తెలుసుకుంటే మరో సారి ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.
షాపింగ్ సైట్స్, యాప్స్ ఓపెన్ చేయడం అలవాటు ప్రతీ ఒక్కరికి అలవాటు. ఏం కొనాలని లేకున్నా… ఊరికే చూద్దామని యాప్ ఓపెన్ చేసి చివరకు ఏదో ఓ ఆఫర్కు టెంప్ట్ అయిపోయి అవసరం లేనివి కూడా కొనేస్తుంటారు. తర్వాత ఎందుకు కొన్నామని బాధపడుతుంటారు.
నిజంగా ఏదైనా కంపెనీ 90% డిస్కౌంట్ ఇస్తుందంటే ఆ కంపెనీ దివాళా తీయాల్సిందే. ధర పెంచి డిస్కౌంట్ ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ కంపెనీ కూడా నష్టాలకు తమ వస్తువులను అమ్ముకోదు. క్లియరెన్స్ సేల్ అని చెప్పినా వ్యాపారుల లాభం వ్యాపారులకు ఉంటుంది. కాకపోతే ఆ వస్తువు మీరు అనుకున్న ధరలోనే వస్తుందా లేదా అన్నది చూసుకుంటే చాలు. ఆఫర్లకు టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.
రూ.1,000 విలువ చేసే వస్తువును సేల్ సమయంలో రూ.300 అమ్ముతున్నట్టు కొన్నిసార్లు ఇ-కామర్స్ సైట్లు ప్రకటిస్తుంటాయి. నిజానికి ఆ వస్తువు రేటు మీరు చూసినప్పుడు రూ.1,000 ఉంటుంది. అందులో కొత నిజం ఉన్నా అక్కడే కష్టమర్లకు గాలం వేస్తారు.
రూ.300 ధరకు అమ్మేది కొన్ని వస్తువుల్ని మాత్రమే. అందుకే ‘స్టాక్ ఉన్నంత వరకే’ అన్న నిబంధన పెడుతుంది. అందుకే అలాంటి వస్తువులు సేల్ మొదలైన కొన్ని క్షణాల్లోనే ‘సోల్డ్ అవుట్’ అని కనిపిస్తుంటాయి. అమ్మేది కొన్ని వస్తువులే అయినా భారీ తగ్గింపు అనే ప్రచారంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
సేల్స్ సమయంలో కొన్ని వేల ప్రొడక్ట్స్పై భారీ తగ్గింపు అని ప్రచారం చేస్తుంటాయి ఇ-కామర్స్ సైట్లు. అయితే అందులో కొంతవరకే నిజం ఉంటుంది. కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్ ఇచ్చి… మిగతా వస్తువుల్ని పాత ధరకే అమ్ముతుంటాయి. సేల్ పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం అన్నది వ్యాపార వ్యూహం.
మీరు ఏ వస్తువు కొనాలనుకుంటున్నారో దానిపై కనీసం రెండు వారాలైనా అధ్యయనం చేయండి. మిగతా సైట్లల్లో ధరలెలా ఉన్నాయో పోల్చి చూసుకోండి. ఒక ఇ-కామర్స్ సైట్లో రూ.1,000 ఉన్న వస్తువు మరో సైట్లో రూ.600 కే రావచ్చు. అందుకే నాలుగైదు సైట్లల్లో ధరల్ని పోల్చిచూడండి. ఒక వస్తువును మీరు ఖచ్చితంగా కొనాలని నిర్ణయించుకుంటే… అది అత్యవసరం కాకపోతే సేల్ జరిగే వరకు ఆగొచ్చు.