నవ్యాంధ్ర ప్రజల జీవనాడి పోలవరం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే క్రస్టు గేట్లు బిగించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. స్పిల్ వేలో 40, 41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు చేశారు. అనంతరం గేటు అమర్చే ప్రక్రియకు సీఎం శ్రీకారం చుట్టారు.
పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 48 గేట్లను అమర్చాల్సి ఉండగా.. తొలి గేటు అమర్చేందుకు ఇవాళ తొలి అడుగు పడింది. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా.. వెడల్పు 15.9 అడుగులు. గేట్ల తయారీకి దాదాపు 18వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో బాబు ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించేటప్పుడు కొందరు విమర్శలు చేశారని పరోక్షంగా జగన్ను టార్గెట్ చేశారు. ఈ పథకం ద్వారా పథకంలో గ్రావిటీ ద్వారా నీటిని శ్రీశైలంలో నింపి అక్కడ నుంచి హాంద్రినీవా ద్వారా అనంతపురం జిల్లాకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
మే నెలలో రెండు కాలువలను ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఒక కాలువ ద్వారా నీటిని విశాఖ జిల్లా వరకు, మరో కాలువ ద్వారా కృష్ణా జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కాకపోతే పోలవరం ప్రాజెక్టు సాకారమయ్యేది కాదన్నారు. ఏడు మండలాలను విలీనం చేయకపోతే సీఎంగా ప్రమాణం చేయనని ఆనాడు మోదీకీ చెప్పానన్నారు.
పోలవరం ప్రాజెక్టకు సంబంధించి 63 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని 2019లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమన్న వారికి సమాధానం చెప్పేలా పోలవరం ప్రాజెక్టును నిర్మించి త్వరలోనే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో రేడియల్ గేటు బరువు 300 టన్నులు ఉందని గేట్లను నిలబట్టడం కోసం హైడ్రాలిక్ సిలిండర్లను వాడనున్నట్లు తెలిపారు. గేట్లను నిలబెట్టేందుకు హైడ్రాలిక్ సిలిండర్లను ఉపయోగిస్తారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు కాగా, వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గేట్ల ఏర్పాటులో హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్లు కీలకం. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 96 బుష్లు అవసరం. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 500 టన్నుల బరువును ఎత్తుతుంది.
తొలిగేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో మే చివరి నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలన్న పట్టుదలతో ఉంది ప్రభుత్వం. ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9,560 అడుగులు ఉంటుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సహా సాగు, మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.