ఏపీతో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దావోస్లో సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఐబీఎం, కోయ క్యాపిటల్, జుబిలియంట్ గ్రూప్ , పనోరమా సంస్థల అధిపతులకు జగన్ భేటీ అయ్యారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ, హై ఎండ్ టెక్నాలజీ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంస్థల ప్రతినిధులతోనూ జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ రంగాలకు సంబంధించి ఏపీకి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో కీలక భేటీలో పాల్గొన్నారు. బహ్రెయిన్కు ఏపీ నుంచి జరుగుతున్న ఎగుమతులపై వీరి మధ్య చర్చలు జరిగాయి. ప్రఖ్యాత స్టీల్ కంపెనీ ఆర్సెల్ విట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తోనూ సీఎం జగన్ చర్చించారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మిట్టల్ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టును ఏపీలో ప్రారంభించాలని భావిస్తోంది. మొత్తం 600 మిలియన్ డాలర్లు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని మిట్టల్ హామీ ఇచ్చారు.