కర్నాటక రాజకీయాల్లో సంచలన సంఘటన చోటుచేసకుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సీఎంగా యడ్డూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు ఏపార్టీకి సంపూర్ణమెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా అనూహ్యంగా భాజాపా సీఎంగా యడ్యూ రప్ప ప్రమాణస్వీకారం చేసి తన పంతాన్ని నెగ్గించుకున్నాడు.
యడ్యూరప్ప తన కోరికను నెరవేర్చుకున్నారు. ముందు చెప్పినట్టుగానే నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ప్రమాణం చేయించారు. “బీఎస్ యడ్యూరప్ప అనే నేను…” అంటూ ఆయన ప్రమాణ స్వీకారం కన్నడలో సాగింది.
పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా ఈ కార్యక్రమం ముగిసింది. ఆపై ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ శ్రేణులు యడ్యూరప్పకు, బీజేపీకి జయజయధ్వానాలు పలికాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
బలనిరూపణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 15 రోజుల పాటు సమయాన్ని కూడా ఇచ్చారు గవర్నర్. ఈ నేపథ్యంలో ఫిరాయింపులు జరగవచ్చు అనే ఊహాగానాలున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు పలికే అవకాశం ఉంది. అలాగే ఒక ఇండిపెండెంట్ ఇప్పటికే కమలం గూటికి చేరగా.. పక్షం రోజుల సమయం ఉంది కాబట్టి అప్పట్లోగా మరో ఇండిపెండెంట్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు.
అధికారం బీజేపీ చేతికి వెళ్లిపోయింది కాబట్టి.. ఇక మేనేజ్ చేయడం ఆ పార్టీకి పెద్ద ఇబ్బందికరం ఏమీ కాకపోవచ్చు. ఇక యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, ఆయనతో పాటు మంత్రులుగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. బల నిరూపణ తర్వాత మంత్రి వర్గ ప్రమాణస్వీకారం ఉంటందిని భాజాపా నేతలు వెల్లడించారు.