సీబీఐ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీబీఐకి వెంటనే కొత్త డైరెక్టర్ను నియమించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు ఆ పని కొనసాగుతూనే ఉంది. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో ప్రధానితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సభ్యులుగా ఉన్నారు.
మోదీ సూచించిన పేర్లకు ఖర్గే అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం తేలడం లేదు. సీనియర్ ఐపీఎస్ అధికారులు జావెద్ అహ్మద్, రజనీకాంత్ మిశ్రా, ఎస్.ఎస్.దేశ్వాల్, శివానంద ఝా పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం సూచించిన పేర్ల పట్ల ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మద్దతు తెలిపితే సదరు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఏ నిర్ణయం రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వర రావును నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న బెంచ్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రి తనకు తానుగా వైదొలిగారు. ఈ కేసు విచారణను ఏకే సిక్రి నేతృత్వంలోని బెంచ్ మరో బెంచ్కి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ పిటిషన్పై విచాణ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ తప్పుకున్నారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావును నియమించడాన్ని రద్దు చేస్తూ రూలింగ్ ఇవ్వాలని కోరుతూ ‘కామన్ కాస్’ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.