తిరుమల శ్రీవారి ప్రియ భక్తుడు డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ నివాళులు అర్పించారు. తిరుపతిలోని డాలర్ శేషాద్రి ఇంటికి చేరుకున్న ఆయన శేషాద్రి భార్యను ఓదార్చారు. డాలర్ శేషాద్రితో తనకు 25 ఏళ్ల అనుభందం ఉన్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఆయన లేరనే వార్తను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నానని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతీసారీ డాలర్ శేషాద్రి ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ఎన్వీ రమణ గుర్తు చేసుకున్నారు. తనతో పాటు వచ్చిన వారిని సైతం ఆయన ఆప్యాయంగా, చిరు నవ్వుతో పలకరించేవారన్నారు.
దాదాపు ఆయన 3 దశాబ్దాల పాటు శ్రీవారికి సేవ చేశారని, శేషాద్రి స్వామిని దేవుడు అప్పుడే తీసుకెళ్లాడని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు శేషాద్రి పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.