కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆదివారం రోజున చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. అయితే నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.45 గంటలకు అయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
ఎంఎస్ఆర్ జనవరి 14, 1934లో కరీంనగర్ జిల్లా వెదిరే గ్రామంలో జన్మించారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చైర్మన్గా, దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. 1980 నుంచి 83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా ఎంఎస్ఆర్ గెలుపొందారు.
అనంతరం మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 14 ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 1990-94 వరకు ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్ పనిచేశారు. 2004-07 వరకు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్ మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుడిని ప్రార్థించారు.
18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్!