రక్తదానానికి మించిన దానం లేదు. మనం చేసే రక్తదానం వెరొకరి జీవితానికి వెలుగునిస్తుంది. అందుకే రక్తదానంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. అయితే సకాలంలో రక్తం అందక చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. తద్వారా అవతలివారి ప్రాణాలను కాపాడటమే కాదు మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తం దానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదు.
క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఎక్కువ ఐరన్ పేరుకుపోవడం వల్ల రక్త ధమనులను అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పొంచి ఉంటుంది. హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం ద్వారా అదనపు ఐరన్ నిల్వను తగ్గించవచ్చు.
రక్తదానం తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి జన్యు రక్త రుగ్మతలు ఉన్న వ్యక్తులను కాపాడుతుంది. రక్తదానం చేయడం వల్ల మొత్తం వ్యవస్థను పునరుద్ధరించవచ్చు. ఒక వ్యక్తి డయాలసిస్ లేదా స్వచ్ఛంద రక్తదానం చేయించుకున్నప్పుడు ఎర్ర రక్త కణాలు కొత్తగా ఏర్పడుతాయి.