- దుబాయ్లాంటి పద్ధతి హైదరాబాద్లో
- ట్రాఫిక్ నియంత్రణకు రోబోతో ప్రయోగం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి అడ్డాగా ప్రస్తుతం హైదరాబాద్ నిలుస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించింది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. అందులో భాగంగా టీ హబ్ వంటి విభిన్న పథకాలు, కార్యక్రమాలు చేపడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దూసుకెళ్తున్నాడు. వాటిలో భాగంగా మరో విభిన్న పథకంతో ఓ కార్యక్రమం చేపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో మరో ఆసక్తికర అంశంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
కొత్త సంవత్సరం వేళ.. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రోబోను ప్రవేశపెట్టనున్నారు. రోబో పోలీస్గా మారి పని చేయనుందట. హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఈ ప్రాంతం ఉదయం, సాయంత్రం, రాత్రి ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంటుంది. రాత్రయితే రేసర్లు తమ ప్రతాపం చూపిస్తుంటారు. అత్యంత ప్రమాదకర ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ విధులు నిర్వహించాలంటే ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన ప్రాణంగా అనిపిస్తుంది. అందుకే పోలీసుల స్థానంలో రోబోను ఉంచనున్నారట.
పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి హోచ్ బోట్స్ రోబోటిక్స్ కంపెనీ ఈ రోబో పోలీస్ను తయారు చేసింది. దుబాయ్లో చక్రాలపై కదిలే రోబో పోలీస్ విధులు నిర్వహిస్తుండగా.. అందుకు భిన్నంగా హైదరాబాద్ రోబో పోలీస్ను రూపొందించారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో విధులు నిర్వహించేలా రోబో పోలీస్ను ఏర్పాటు చేయనున్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లో ప్రతియేటా 10 రోబోలను తయారు చేసే అవకాశం ఉంది.
ఈ రోబో పోలీస్ ప్రజల్ని పలకరించడం.. గుర్తు పట్టటం.. ఫిర్యాదుల్ని స్వీకరించడంతో పాటు.. అనుమానితుల్ని.. బాంబుల్ని గుర్తించడం వంటి పనులు కూడా చేయడం ఈ రోబో ప్రత్యేకత అంట. కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ రోడ్ల మీదకు వచ్చే ఈ రోబో పోలీస్ను చూసేందుకు హైదరాబాద్వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.