మా ఆదేశాలను బేఖాతరు చేస్తారా.. మేం ఇచ్చిన తీర్పును తుంగల్లో తొక్కుతూ బహిరంగంగా.. దర్జాగా కోడిపందేలు నిర్వహించడంపై ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం ఇచ్చిన తీరుపై గౌరవం లేకుండా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కోడిపందేలు దగ్గరుండి నిర్వహించడంపై మండిపడింది. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించిన వారందరి వివరాలు సమర్పించండి అని హైకోర్టు మంగళవారం కోరింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలాచోట్ల ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందేలు అధికారికంగా నిర్వహించారు. కోడి పందేలు నిర్వహించడం నిషేధం అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పును ధిక్కరిస్తూ దర్జాగా కోడిపందేల్లో పాల్గొన్నారు. టెంటులు, మైకులు పెట్టి ఒక ఉత్సవం మాదిరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు జరిపించారు. ఇవన్నీ మీడియాలో ప్రసారమయ్యాయి.
అయితే ఈ విషయమై హైకోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు చీవాట్లు పెట్టింది. టీడీపీ నాయకుల వివరాలు, సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు అందాయి. తమ ఆదేశాలను లెక్కచేయని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఖాతరు చేయని వారికి సంబంధించిన అన్నీ వివరాలు వెంటనే తమకు అందచేయాలంటూ కోర్టు మంగళవారం జారీ చేసింది.
గుంటూరు జిల్లాలో కోడిపందేలు ఆడిన టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు వెంటనే వారికి నోటీసులు అందచేయాలని ఆదేశించింది. కోళ్ల పందేలను నిర్వహించిన వారి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు, రెవెన్యూ అధికారులకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కోరింది.
మిగతా విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.