కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లకు హైకోర్టులో ఊరట లభించింది. సదరు సభ్యులు అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. వారిపై వేసిన బహిష్కరణలను హైకోర్టు ఎత్తేస్తూ తీర్పునిచ్చింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్పై దాడి చేశారని సదరు ఎమ్మెల్యేలపై అభియోగాలు ఉన్నాయి. అయితే, తమ బహిష్కరణ వేటు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని వారు కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నల్లగొండ, ఆలంపూర్ శాసన సభ స్థానాల్లో ఖాళీ ఏర్పడిందంటూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖను కూడా న్యాయమూర్తి ప్రస్తావించారని, ఈ తీర్పుతో ఆ లేఖ కూడా చెల్లుబాటు కాకుండా పోతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాకు తెలిపారు. తీర్పుపై కాంగ్రెస్ వర్గాలు హర్షాతిరేకం వ్యక్తం చేశాయి.