సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన వ్యవహారం మరో మలుపు తిరిగింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కాంగ్రెస్ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై సోమవారం (మే 7) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా వెనక్కి తీసుకుంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మంగళవారం సదరు పిటిషన్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో తెలిపారు.
రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ భారత సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ప్రతాప్ సింగ్ భజ్వా (పంజాబ్), అమీ హర్షద్రే యాజ్నిక్ (గుజరాత్) సోమవారం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
ఈ పిటిషన్ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్ల ధర్మాసనం.. రెండో నంబర్ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ప్రకటించారు. కానీ. రాత్రికి రాత్రే ధర్మాసనం మారిపోయింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను సిబల్ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్ తన పిటిషన్ను వెనక్కి తీసుకుంది.