కర్ణాటక శాసనసభ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజాపా మ్యాజిక్ ఫిగర్ను అధిగమించే దిశగా దూసుకుపోతోంది. ఇక ఎవరితో పొత్తులేకుండా సొంతంగా భాజాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ సీఎం సిద్ధా రామయ్య పోటీ చేసిన చాముండేశ్వరి నియోజక వర్గంనుంచి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు.
సమీప ప్రత్యర్థి, జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో సుమారు 20 వేల పైచిలుక ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక రెండో స్థానం బాదామీలో బీజేపీ అభ్యర్థి, బి శ్రీరాములపై సిద్ధ రామయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి, బీఎస్ యడ్యూరప్ప షికారిపుర నుంచి విజయబావుటా ఎగురవేశారు. వరుణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన సిద్ధూ తనయుడు యతీంద్ర విజయం సాధించారు.
ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి ఎవరి మద్దతు లేకుండానే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి కాషాయదళం చేరుకుంది. మొత్తం 222 స్థానాల్లో 112 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ 70 స్థానాల్లో, జేడీఎస్ 38 చోట్ల, ఇతరులు2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మధ్య కర్ణాటకలోని 35 నియోజకవర్గాల్లో బీజేపీ 23 స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది.